న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్ల్లో వెయ్యి కంటే ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయి. కేసు పెరుగుదల వెనుక ఒమిక్రాన్, సబ్ వేరియంట్ల నుంచి ఏదైనా కొత్త వేరియంట్, సబ్ వేరియంట్ రూపాంతరం చెందిందా? అని తెలుసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం బీఏ.2, బీఏ2.38 కొవిడ్ కేసుల పెరుగుదల వెనుక ఒమిక్రాన్, వేరియంట్లు ప్రధాన కారణంగా ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిపుణులు పేర్కొంటున్నారు. బీఏ.2తో పాటు సంబంధిత వైరస్ కేసులు 85శాతం గుర్తించారు. బీఏ.2.38 కేసులు 33శాతం నమూనాల్లో కనుగొన్నారు. 10 శాతం కంటే తక్కువ శాంపిల్స్లో బీఏ.4, బీఏ.5 కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 43 జిల్లాల్లో, కేరళలో 11, మిజోరంలో ఆరు, మహారాష్ట్రలో ఐదు జిల్లాల్లో వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉన్నది. రాజస్థాన్లో ఎనిమిది, ఢిల్లీలో ఐదు, తమిళనాడులో నాలుగు జిల్లాలతో సహా 42 జిల్లాల్లో, వీక్లీ పాజిటివిటీ రేటు 5-10శాతం వరకు ఉందని అధికార వర్గాలు వివరించాయి.