న్యూఢిల్లీ, మార్చి 5: రాజ్యాంగాన్ని అన్వయించడానికి న్యాయ వ్యవస్థను అనుమతించాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమ కోహ్లి అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కేవలం న్యాయ సూత్రం మాత్రమే కాదని, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది మూల స్తంభమని పేర్కొన్నారు. ‘స్వతంత్ర న్యాయ వ్యవస్థ-చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి కీలకం’ అంశంపై శనివారం కోల్కతాలో జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో న్యాయ వ్యవస్థ రక్షణ గోడగా పని చేస్తుందని ఆమె అన్నారు. రాజ్యాంగం తమకు నిర్దేశించిన విధులను నిర్వర్తించడానికి భారత న్యాయ వ్యవస్థ అంకిత భావంతో స్వతంత్రంగా పని చేస్తున్నదని చెప్పారు. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ పాత్ర పోషించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలు అవినీతి మయం అవుతాయని, అధికార దుర్వినియోగం జరుగుతుందని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం తగ్గిపోతుందని జస్టిస్ హిమ కోహ్లి పేర్కొన్నారు.