బెంగళూరు, ఫిబ్రవరి 23: కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ’40 శాతం కమీషన్’ ఆరోపణలకు సంబంధించి స్థానిక ప్రత్యేక కోర్టు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీచేసింది. బీజేపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. మార్చి 28న కోర్టు ముందు హాజరు కావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు హస్తం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా 40% కమీషన్ సర్కార్ అంటూ పోస్టర్లు, క్యూఆర్ కోడ్లతో పెద్దయెత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ లీగల్ విభాగానికి చెందిన వినోద్ కుమార్ అనే న్యాయవాది కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు.