న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అప్పగించాలని కున్వర్ మహేందర్ ధ్వజ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆగ్రా యునైటెడ్ ప్రావిన్స్కు వారసుడినని చెప్పుకొంటున్న ప్రతాప్సింగ్, 1947 తర్వాత భారత ప్రభుత్వం కుతుబ్మినార్ భూమిని తన నుంచి స్వాధీనం చేసుకొన్నదని వాదిస్తున్నారు. వాస్తవానికి కుతుబ్మినార్ లోపల హిందూ, జైన ఆలయాలు ఉన్నాయని, వాటిలో పూజలకు అనుమతి ఇవ్వాలని పలు హిందూ సంఘాలు వేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్నది. అందులో ప్రతాప్సింగ్ ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేశారు.