Twisha Sharma : నోయిడాకు చెందిన త్విషా శర్మ మృతి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విష శర్మ భర్త సమర్ధ్ సింగ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్ను భోపాల్ కోర్ట్ సోమవారం నిరాకరించింది. కేసు విచారణ నిష్పక్షపాతంగా, లోతుగా జరగాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం ఆమె భర్త సమర్ధ్ శర్మ పరారీలో ఉన్నారు. పోలీసులు అతడిపై రూ.10,000 నజరానా ప్రకటించారు. పాస్పోర్టును కూడా రద్దు చేశారు.
ఈ నెల 12న రాత్రి త్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో ఆమె మరణానికి భర్త, అతడి కుటుంబ సభ్యులే కారణమంటూ మృతురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్విషా శర్మ వివాహం గత ఏడాది డిసెంబర్లో సమర్ధ్ సింగ్తో జరిగింది. త్విష మరణంపై దాఖలైన కేసు విచారణ భోపాల్ కోర్టులో జరిగింది. త్విష పెళ్లైన తర్వాత నుంచి ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారని, కట్నం కోసం వేధించారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, మృతురాలి కుటుంబం చేసిన ఆరోపణల్ని సమర్ధ్ తరఫు లాయర్లు ఖండించారు. భర్త, అతడి కుటుంబం వేధింపులకు పాల్పడింది అనేందుకు తగిన ఆధారాలు లేవన్నారు.
ఆమె మానసిక సమస్యల్తో బాధపడుతోందని, ఆమె వాడుతున్న మందులను పరిశీలించాలని సమర్ధ్ లాయర్లు కోరారు. అంతేకాదు.. త్విష అత్తవారింట్లో వేధింపులకు గురైతే.. పుట్టింటికి వెళ్లిన ప్రతిసారీ ఆమె తిరిగి అత్తారింటికి ఎందుకు తిరిగిస్తుందని లాయర్లు ప్రశ్నించారు. అయితే, కేసు విచారణ లోతుగా జరగాలి కాబట్టి, సమర్ధ్కు బెయిల్ ఇవ్వకూడదని త్విష తరఫు లాయర్లు కోరారు. దీంతో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. త్విష, సమర్ద్.. 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సింగ్ తల్లి.. ఒక రిటైర్డ్ జడ్జి కావడం గమనార్హం.