CJI DY Chandrachud | సామాన్య పౌరుల సమస్యలను వినడం లేదన్న ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ‘ఆర్టికల్ 370’ రద్దు విషయమై కశ్మీర్ వాసుల వ్యక్తిగత పిటిషన్లు విచారిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం తెలిపారు. తాము ‘జాతి వాణి’ వింటున్నట్లు పేర్కొన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం కేవలం రాజ్యాంగంపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనాలు మాత్రమే విచారణలు జరుపుతున్నాయంటూ మాథ్యూస్ నెడుంపర అనే న్యాయవాది.. సుప్రీంకోర్టుకు ఈ-మెయిల్ చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను, సాధారణ పౌరుల కేసులను వినడం లేదని ఆరోపించారు.
న్యాయవాది నెడుంపర పంపిన ఈ-మెయిల్పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘నెడుంపర.. మీరు లేవనెత్తిన అంశంపై మీతో చర్చ జరుపాలని నేను కోరుకోవడం లేదు. కానీ మీరు సుప్రీంకోర్టుకు ఈ-మెయిల్ పంపిన సంగతి సెక్రటరీ జనరల్ నాకు తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల అంశాలు విచారించొద్దు.. రాజ్యాంగేతర ధర్మాసన విషయాలు విచారించాలని మీరు పేర్కొన్నారని సెక్రటరీ జనరల్ నాకు తెలిపారు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం పేర్కొంది. తాను సుప్రీంకోర్టుకు ఈ-మెయిల్ చేసిన సంగతిని న్యాయవాది నెడుంపర అంగీకరించారు. సాధారణ పౌరుల కేసులు వినడం లేదని మాత్రమే తాను ఈ-మెయిల్ చేశానన్నారు.
‘కానీ 370 అధికరణం రద్దుపై కశ్మీర్ లోయకు చెందిన వ్యక్తులు, గ్రూపుల పిటిషన్లన్నీ విచారించాం. వాటన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రయత్నించాం. కనుక మేం జాతి వాణి వింటున్నాం’ అని జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు. అయితే, నెడుంపర ఒక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ అంశంపై దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని నెడుంపర ఆశ్రయించారు.