CAA | త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నది. మరో వైపు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరోసారి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సీఏఏ అమలుకు సంబంధించి విధివిధానాలను సోమవారం విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేటి రాత్రిలోగా హోంమంత్రిత్వ శాఖ సీఏఏ విధివిధానాలను నోటిఫై చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోర్టల్ను సైతం సిద్ధం చేసిందని.. ఇందులో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు సంబంధించిన అన్ని లాంఛనాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పూర్తి చేసింది. మూడు దేశాలకు చెందిర ఆరు ముస్లిమేతర వలస వర్గాలకు పౌరసత్వం కల్పించనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం-2019కి సంబంధించిన నిబంధనలు రూపొందించేందుకు లోక్సభలో సబార్డినేట్ లెజిస్లేషన్పై పార్లమెంటరీ కమిటీ నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గడువు పొడిగింపునకు అనుమతి లభించింది.
పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల ప్రకారం.. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ముస్లింమేతర వలసదారులు భారత పౌరసత్వం పొందేందుకు మార్గం సులభతరమవనున్నది. ఆయా దేశాలకు చెందిన ఆరు వర్గాల్లో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం లభించనున్నది. కేంద్రం 2019 డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదించింది. 2014 డిసెంబర్ 31 అంతకన్నా ముందుకు పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి మాత్రమే చట్టం వర్తిస్తుంది.
అయితే, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా మరోసారి లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నది. ఇందులో భాగంగా నిబంధనలను నోటిఫికై చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు కేంద్రమంత్రులు సైతం ఎన్నికలకు ముందే సీసీఏను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం విధితమే.