న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుదల నేపథ్యంలో లాక్డౌన్ తదితర కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నాహాలను ముమ్మరం చేశాయి. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.
ప్రస్తుతం దేశంలో ఫ్రంట్లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు మాత్రమే వేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా తీసుకోవచ్చని లేదంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే కాకుండా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ విదేశాల్లో నానాటికి పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా.. బూస్టర్ డోస్ ఇవ్వకపోవడంతో విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలా ? వద్దా? అనే అంశంపై చర్చిస్తున్నది. మరో వైపు దేశంలో కొవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య విరామాన్ని సైతం తగ్గించాలని సిఫారసులు కేంద్రానికి వచ్చాయి.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గత డిసెంబర్లోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిని నిలిపివేసింది. కంపెనీ వద్ద 200 మిలియన్ డోసుల నిల్వలున్నాయి. సీరమ్ కంపెనీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎక్కువగా భారత్ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లోనే ఉపయోగించారు. కంపెనీ ఇప్పటివరకు 1.9 బిలియన్ డోస్లను ఉత్పత్తి చేసింది. బూస్టర్ డోస్ లేదంటే మరేదైనా డిమాండ్ వస్తే వ్యాక్సిన్ ఉత్పత్తిని పునః ప్రారంభించినట్లు పేర్కొన్నాయి.
60 ఏళ్ల లోపు వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ వినిపిస్తోంది. జీరో అవర్లో రాజ్యసభలో ఈ అంశాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది లేవనెత్తారు. 60 ఏళ్లలోపు వారు విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చాలా యూరోపియన్ దేశాల్లో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమై మూడో సంవత్సరం. మరోసారి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ చాలా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. కరోనా ఓమిక్రాన్ బీఏ.2 వేరియంట్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో రాబోయే వారాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉందని యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. కరోనాకు నాల్గో డోస్ సైతం అవసరం కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల 12-14 ఏజ్ గ్రూప్లో టీకాల పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 72లక్షలకుపైగా డోసులకుపైగా పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 1,82,23,30,356 డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు వివరించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్యకర్తలతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి 2.21 కోట్లకు పైగా ప్రికాషన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు నమోదు రికార్డవగా.. 67 మంది మరణించారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం బుధవారం 1,778 కేసులు నమోదవగా.. 62 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 4.30 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసులు 22,427 ఉన్నాయి. మహమ్మారి కారణంగా 5,16,672 మంది ప్రానాలు కోల్పోయారు. వైరస్తో 4.24కోట్ల మంది బాధితులు కోలుకున్నారు.