Corona virus : దేశంలో కరోనా వైరస్ (corona virus) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 99 మంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009 ఉంది. అయితే గడిచిన వారం రోజుల్లోనే 750 మందికి కొత్తగా కరోనా సోకింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ మధ్య ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్తోపాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు తెలిపారు.
అవే ఉపరకాలను భారత్లో గుర్తించినట్లు ఇటీవల ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గత వారం వెల్లడించింది. కేసులపరంగా కేరళ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా బీహార్లో తొలి కేసు నమోదైంది. అయితే కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.