Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య 179కి చేరింది. క్షతగాత్రులను సోరో, గోపాల్పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైంది. రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు వెలికి తీస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గూడ్స్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్లోని ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించారు. 044-2535 4771, 67822 62286, బెంగాల్ హెల్ప్ లైన్ నంబర్లు – 033 – 2214 3526, 2253 5185.