న్యూఢిల్లీ: పూరి జగన్నాథ ఆలయం వద్ద చేపడుతున్న నిర్మాణాలపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒడిశా ప్రభుత్వం చేపడుతున్నట్లు నిర్మాణ ప్రక్రియ ప్రజల ప్రయోజనార్థమే జరుగుతోందని సుప్రీం తెలిపింది. పూరి ఆలయం వద్ద నిర్మాణ పనులను నిలిపివేయాలని వేసిన పిటిషన్లను సుప్రీం కొట్టిపారేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పూరి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విధి అని, అలాంటప్పుడు ఆ నిర్మాణాన్ని ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
అనవసరమైన పిల్స్ను దాఖలు చేయరాదు అని కోర్టు సీరియస్ అయ్యింది. ప్రతి రోజు 60 వేల మంది భక్తులు ఆలయాన్ని విజిట్ చేస్తారని, అక్కడ అధిక సంఖ్యలో టాయిలెట్లను నిర్మించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ అశోక్ కుమార్ పరిజా కోర్టులో వాదించారు. సంస్కృతి శాఖ అనుమతితోనే నిర్మాణం జరుగుతోందన్నారు. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ) ప్రకారమే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. నిర్మాణాలను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన ఇద్దరికీ చెరో లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది.