బెంగళూరు: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే (BJP MP Anantkumar Hegde) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్తోపాటు రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉంటే, హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అన్నారు. శనివారం ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అనంతకుమార్ హెగ్డే మాట్లాడారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ ఎలా సాధ్యమవుతుందో అన్నది వివరించారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభలో మెజారిటీ ఓట్లతో ఇది జరగదు. లోక్సభ, రాజ్యసభతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో మూడింట రెండొంతుల మెజారిటీ మాకు (బీజేపీకి) అవసరం’ అని మాజీ కేంద్ర మంత్రి అయిన ఆయన అన్నారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని ప్రవేశపెట్టేందుకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించాల్సిన అవసరం ఉందని ఎంపీ అనంతకుమార్ హెగ్డే తెలిపారు. ‘సీఏఏను లోక్సభలో ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టులో కూడా దీనిపై పోరాడారు. మేం దానిని లోక్సభలో ఆమోదించాం. రాజ్యసభలో కూడా దానిని రద్దు చేయగలిగాం. కానీ రాష్ట్రాల నుంచి ఎటువంటి ఒప్పందం లేదు. అందుకే దానిని అమలు చేయలేకపోయాం’ అని అన్నారు. సీఏఏ ఆమోదం పొందకపోతే దేశంలో శాంతిభద్రతలు మన చేతుల్లో ఉండవని, దేశద్రోహులకు వేదిక అవుతుందని అన్నారు.