చెన్నై, ఏప్రిల్ 24: కులం, మతం ఆధారంగా తమిళులను విభజించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. అటువంటి కుట్రలను తిప్పికొట్టాలని, రాష్ట్ర ప్రజలందరూ తమిళులుగా ఐక్యంగా ఉండాలని అన్నారు.
చెన్నైలో ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కుల, మత ప్రాతిపదికన విభజించడం ద్వారా తమిళ జాతికి ముగింపు పలకొచ్చని, మన అభివృద్ధిని అడ్డుకోవచ్చని కొంతమంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ ఉచ్చులో పడకూడదని, అటువంటి ప్రయత్నాల వెనుక కుట్రలను పసిగట్టాలని సూచించారు.