న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ స్పష్టం చేసింది. స్కూళ్లు మళ్లీ తెరవడం అనేది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ ప్యానెల్ అభిప్రాయపడింది. ఇంతకాలంగా స్కూళ్లు మూతపడటం కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, చాలా మంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారని ఈ ప్యానెల్ వెల్లడించింది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఇన్నాళ్లుగా స్కూళ్లు మూతపడటం వల్ల అది పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదాన్ని విస్మరించకూడదు. చిన్న పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా నాలుగు గోడలకే పరిమితం కావడం వల్ల తల్లిదండ్రులతో పిల్లల సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఈ ప్యానెల్ తన రిపోర్ట్లో తెలిపింది. అంతేకాదు దీని కారణంగా బాల్య వివాహాలు, బాలకార్మికుల మళ్లీ పెరిగిపోతున్నట్లు అందులో స్పష్టం చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే స్కూళ్లు తెరవడం అనేది చాలా ముఖ్యమని తన నివేదికలో ప్యానెల్ సిఫారసు చేసింది.
స్కూళ్లు తెరవాల్సిందే..
విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలకు సంబంధించిన పార్లమెంటరీ ప్యానెల్ స్కూళ్లు మూతపడటం వల్ల కలుగుతున్న ప్రతికూల ప్రభావాలపై అధ్యయనం జరిపింది. ఈ సమస్యను విస్మరించకూడదని ఈ ప్యానెల్ తన రిపోర్ట్లో తేల్చి చెప్పింది. స్కూళ్లు తెరవడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా పలు సూచనలు చేసింది. టీచర్లు, విద్యార్థులు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా స్కూళ్లు తెరవచ్చని సూచించింది. ఒక రోజు తప్పించి మరో రోజు లేదా రెండు షిఫ్ట్లలో స్కూళ్లు నడిపే ఆలోచన చేయాలని చెప్పింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయడంతోపాటు ప్రతి స్కూళ్లో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉండేలా చూడాలని సూచించింది.