సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలుపు సాధించగా, బీజేపీ 23 స్థానాలు గెలిచి, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇక ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ ఎలాంటి ప్రభావం చూపడం లేదు. హిమాచల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 35 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది మేజిక్ ఫిగర్ను కాంగ్రెస్ సునాయాసంగా చేరుకుంది. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
తమ ఎమ్మెల్యేలను రాజస్ధాన్కు తరలించాలని యోచిస్తున్న కాంగ్రెస్ ఆ బాధ్యతను చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్, పార్టీ నేత భూపీందర్ సింగ్ హుదాలకు అప్పగించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సొంత రాష్ట్రం కావడంతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారగా ఇక్కడ కాంగ్రెస్ విస్పష్ట ఆధిక్యంతో దూసుకెళుతుండటం కమలనాధులను కలవరపరుస్తోంది.