త్వరలో సోనియాతో మమత భేటీ?
న్యూఢిల్లీ, జూలై 23: బెంగాల్లో ఉప్పు-నిప్పులా ఉండే తృణమూల్-కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనుకుంటున్నాయా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపును నిలువరించడానికి ఒకేతాటిపైకి రానున్నాయా? ‘పెగాసస్’ స్పైవేర్ గూఢచర్యం వివాదం ఆ రెండు పార్టీలను దగ్గరకు చేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘పెగాసస్’ జాబితాలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సోనియా కుమారుడు రాహుల్గాంధీ పేర్లు బయటకు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ‘పెగాసస్’ అంశాన్ని ప్రధాన ఆయుధంగా మల్చుకున్న విపక్షాలు పార్లమెంట్లో కేంద్రప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, తృణమూల్ ఎంపీలు ఈ అంశంపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, వచ్చేవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్-తృణమూల్ క్రమంగా దగ్గరవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.