లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ( Priyanka Gandhi ) మీడియాకు వెల్లడించారు. తాము మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని, అధికారంలో వారు పూర్తిస్థాయి భాగస్వాములు కావాలని ఆశిస్తున్నామని ప్రియాంకాగాంధీ చెప్పారు.
ఈ మధ్యాహ్నం లక్నోలో మీడియాతో మాట్లాడిన ప్రియాంకాగాంధీ.. నేను ఇవాళ మా మొదటి హామీ గురించి మాట్లాడబోతున్నా. వచ్చే ఏడాది యూపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించాం అని చెప్పారు. భవిష్యత్తులో మహిళలకు కేటాయించే టికెట్ల సంఖ్యను 40 శాతం నుంచి 50 శాతానికి పెంచుతామని ఆమె తెలిపారు. మహిళలంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రియాంకాగాంధీ ప్రకటించిన ప్రకారం 40 శాతం టికెట్లు అంటే 161 స్థానాలకు సంబంధించిన టికెట్లను కాంగ్రెస్ పార్టీ మహిళకు ఇవ్వనుంది. అయితే, ఈ విషయం ప్రకటించేటప్పుడు ప్రియాంక కూర్చున్న మీడియా సమావేశ వేదికపై ఏడుగురు పురుషులు ఉంటే, ఇద్దరే మహిళలు ఉండటం గమనార్హం. కాగా మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా సవాళ్లతో కూడినదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.