ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శివసేన తిరిగి బీజేపీకి చేరువవుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే మహారాష్ట్ర సీఎం అభ్యర్ధిగా ముందుకొచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు.
సేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనేందుకు సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, మోదీపై శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశంసలతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే అభిప్రాయం నెలకొంది.
ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన 57 ఏండ్ల పటోలె ప్రస్తుతం భండారా జిల్లాలోని సకోలి స్ధానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.