న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రైతుల సమస్యలపై మోదీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న క్రమంలో పలువురు రైతులు మరణించడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై రాజ్యసభలో బుధవారం విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే పెద్దల సభ నుంచి వాకౌట్ చేశాయి.
రైతుల మృతి, ద్రవ్యోల్బణం అంశాలపై విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. ఇక అంతకుముందు పార్లమెంట్లో కొవిడ్-19 తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై చర్చ మొదలైంది. ఒమిక్రాన్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండటం పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని మోదీ మంత్రులతో భేటీ అయ్యారు.