న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా భారీ గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అరుణాచల్ ప్రదేశ్లోని వివాదాస్పద ప్రాంతంలో చైనా పెద్ద గ్రామాన్ని నిర్మించిందనే పెంటగాన్ నివేదికను ట్యాగ్ చేస్తూ మోదీ..మీరు శాశ్వతంగా మీ కండ్లు మూసుకున్నారా అంటూ కాంగ్రెస్ శనివారం ట్వీట్ చేసింది.
భారత్తో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా తన వైఖరిని సమర్ధించుకునేందుకు వ్యూహాత్మక చర్యలు చేపడుతోందని బీజింగ్ సైనిక ఆధునీకరణపై పెంటగాన్ తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 2020 మే నుంచి చైనా సైన్యం భారత్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలోకి చొరబడుతూ ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో సేనలను మోహరిస్తోందని నివేదిక తెలిపింది.
సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య, సైనిక సంప్రదింపులు సాగుతుండగానే చైనా వ్యూహాత్మకంగా దుందుడుకు చర్యలను చేపడుతోందని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్లో వివాదాస్పద ప్రాంతంలో 100 ఇండ్లతో కూడిన గ్రామాన్ని చైనా నిర్మించిందని తెలిపింది.