పట్నా : బీహార్లో ఈనెల 30న జరగనున్న కీలక ఉపఎన్నికలకు ముందు ఆర్జేడీతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే కుషేశ్వర్ ఆస్ధాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తన అభ్యర్ధిని బరిలో దింపాలని నిర్ణయించడంతో ఆపార్టీతో పొత్తు నుంచి వైదొలగుతున్నామని బీహార్ కాంగ్రెస్ చీఫ్ భక్త్ చరణ్ దాస్ శుక్రవారం వెల్లడించారు. తమ పార్టీ స్ధానాల్లో ఆర్జేడీ పోటీచేయడమంటే ఇరు పార్టీల మధ్య స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడమేనని దాస్ పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని ఆర్జేడీ నేత తేజస్వి విస్మరించారని ఆరోపించారు. తారాపూర్లోనూ ఆర్జేడీ అభ్యర్ధిని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము బీజేపీతో పోరాడుతుంటే ఆర్జేడీ మాత్రం అధికార దాహంతో తన సిద్ధాంతాలతో రాజీపడుతోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు.