మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తమను ఎంతో నిరాశకు గురి చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాతావరణాన్ని సృష్టించిందని, మాజీ ప్రధానిని చంపిన వారిని విడుదల చేయించిందని మండిపడ్డారు.
ఈ ఘటన కేవలం కాంగ్రెస్ నేతలకే కాదు.. దేశంలోని ప్రతి పౌరుడికీ నిరాశే కలిగించిందని రణదీప్ అన్నారు. ఉగ్రవాది ఉగ్రవాదేనని, ఆయన్ని విడుదల చేయాలని సుప్రీం ఆదేశించడం తమకెంతో బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుడ్ని విడుదల చేయడాన్ని తాము ఖండిస్తున్నామని, ఇదో దురదృష్ట ఘటన అని అన్నారు. ఇవాళ దేశానికి దుర్దినమని రణదీప్ అభివర్ణించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితానికి గుడ్బై చెప్పనున్నాడు. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ధర్మాసనం ఈ ఆదేశం చేసింది. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్ను విడుదల చేయాలని పెట్టుకున్న అభ్యర్థనపై తమిళనాడు గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవడం జాప్యం చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. పెరారివాలన్ రిలీజ్కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది.