న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలిసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ లఖింపూర్ ఖేరి ఘటనలో నిందితుడి తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని తొలగించాలని, అప్పుడే నిష్పాక్షిక విచారణ సాధ్యమవుతుందని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు ఇద్దరితో దర్యాప్తు జరిపించాలని కోరామని తెలిపారు. లఖింపూర్ ఖేరిలో అక్టోబర్ 3న ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడిదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా ఆపై జరిగిన అల్లర్లలో మరో నలుగరు మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.