న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని ప్రభుత్వం పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం తోసిపుచ్చింది. బ్రిటన్ లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జెరెమి కార్బిన్తో రాహుల్ భేటీ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ తన బ్రిటన్ పర్యటన కోసం పొలిటికల్ క్లియరెన్స్ కోరలేదని సీనియర్ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చుతూ రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఎఫ్సీఆర్ఏ అనుమతి పొందారని, ఆయన పర్య పొలిటికిల్ క్లియరెన్స్ అవసరం లేదని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశం లేవనెత్తుతోందని అన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ విదేశీ పర్యటనకు ఎఫ్సీఆర్ఏ అనుమతి సరిపోతుందని, రాహుల్ గాంధీ పర్యటనకు ఎఫ్సీఆర్ఏ క్లియరెన్స్ లభించిందని చెప్పారు. కేంద్ర మంత్రి లేదా ప్రభుత్వ ఉద్యోగుల విదేశీ పర్యటనలకే పొలిటికల్ క్లియరెన్స్ అవసరమని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ సేవకులు కాదని, వారు ప్రజల సేవకులని స్పష్టం చేశారు. ప్రభుత్వేతర పర్యటనల కోసం వారు ప్రభుత్వానికి జవాబుదారీ కాదని పేర్కొన్నారు.