Loksabha Elections 2024 : ఆప్పై ఈడీ మోపిన తాజా అవినీతి ఆరోపణలకు సంబంధించి బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రానున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇది బీజేపీ మరో ఎత్తుగడగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీజేపీ ఎన్నికల రధానికి సీబీఐ, ఈడీలు జోడీ గుర్రాలని, ఎన్నికల విరాళాలను రక్షణ కవచంగా ఆదాయ పన్ను శాఖను ప్రచార వాహనంగా కాషాయ పార్టీ మలుచుకుందని కాంగ్రెస్ నేత హిలాల్ నక్వీ ఆరోపించారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రులను ఈడీ అరెస్ట్ చేసి వారిపై అసాధారణ ఆరోపణలు మోపడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల నిధులను బీజేపీ లూటీ చేసిన తీరుపై దర్యాప్తు సంస్ధల్లో ఏ ఒక్కటీ దృష్టి సారించలేదని నక్వీ దుయ్యబట్టారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు దర్యాప్తు సంస్ధలచే ప్రత్యర్ధి పార్టీల నేతలపై బీజేపీ అభియోగాలు చేయిస్తోందని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో విపక్ష నేతలపై బీజేపీ మరిన్ని ఆరోపణలు గుప్పిస్తుందని ఎస్పీ ప్రతినిధి ఫక్రుల్ హసన్ చాంద్ అన్నారు. బీజేపీ కనుసన్నల్లో దర్యాప్తు సంస్ధలు పనిచేస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం ఈ సంస్ధలను ఎలా దుర్వినియోగం చేస్తోందనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్ధలను బీజేపీ బలహీనపరుస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు.
Read More :
Health Tips | ఒకేసారి లీటరు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? కిడ్నీల మీద ఏమైనా భారం పడుతుందా!