పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు స్పందించారు.విపక్షాల మధ్య ఓట్ల చీలికతోనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధానాలు దక్కలేదని సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ కేవలం 33 శాతం పైచిలుకు ఓట్లతోనే విజయం సాధించిందని, మిగిలిన పార్టీల మధ్య ఓట్ల చీలికతో తమ పార్టీ వెనుకపడిందని వ్యాఖ్యానించారు. గోవాలో మొత్తం 40 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాల్లో కాంగ్రెస్ 11 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ 2 స్ధానాల్లో, టీఎంసీ 2 స్ధానాల్లో ఇతరులు 5 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సీఎం ప్రమోద్ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రచారం కోసం తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సొంత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించలేకపోయానని చెప్పారు. తన తరపున పార్టీ కార్యకర్తలు ప్రచారం చేపట్టారని తాను స్వల్ప తేడాతో గెలుపొందానని అన్నారు.
తాను తక్కువ మెజారిటీతో బయటపడినా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. తమకు 20 స్ధానాలు లభించాయని, మరో ముగ్గరు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. పంజాబ్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీ మిగిలిన రాష్ట్రాల్లోనూ పేలవమైన ఫలితాలు సాధించింది.