న్యూఢిల్లీ : ఇంధన ఉత్పత్తులపై వ్యాట్ను తగ్గించాలని విపక్ష పాలిత రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరడాన్ని కాంగ్రెస్ సహా విపక్ష సీఎంలు తప్పుపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు సెంచరీ దాటి పరుగులు పెడుతూ సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతుంటే ప్రధాని విపక్షాలను టార్గెట్ చేయడమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు వ్యాట్ను తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు తోసిపుచ్చారు. కొవిడ్-19 పరిస్ధితిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పెట్రో భారాలపై రాష్ట్రాలను నిందిస్తూ ప్రధాని వ్యాఖ్యలు చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రదాని తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేశారని, ఏకపక్షంగా అసత్యాలను ముందుకుతెచ్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను కేంద్రం తగ్గించాలని తాము కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై వ్యాట్ వసూలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవం కాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.