న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది. డ్రోన్ల సాయంతో దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనులను తాను తనిఖీ చేస్తుంటానని మోదీ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. కొవిడ్ సమయంలో ప్రజల మరణాలు, ఆకలి కేకలు, మృతదేహాల సామూహిక ఖననం వంటి దృశ్యాలు ప్రధాని డ్రోన్ చూడలేకపోయిందని పేర్కొంది. బీజేపీ అజెండాకు ఏది ఉపయోగపడుతుందో వాటినే ప్రధాని మోదీ డ్రోన్లు పసిగడతాయని కాంగ్రెస్ ప్రతినిధి సునీల్ అహిరె ట్వీట్ చేశారు. చైనా ఆక్రమణను మోదీ డ్రోన్లు ఉద్దేశపూర్వకంగానే చూసీచూడనట్టు వదిలేశాయని అన్నారు.
ప్రధాని డ్రోన్లు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, చైనా బ్రిడ్జిలు, అరుణాచల్ ప్రదేశ్లో చైనా గ్రామాలు, 20 మంది భారత సైనికుల మరణాన్ని చూడలేకపోయాయని పేర్కొన్నారు. కాగా, భారత్ డ్రోన్ మహోత్సవ్లో ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, క్రీడలు వంటి కీలక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని ఆకాంక్షించారు. భారత్లో డ్రోన్ పరిశ్రమ ఉపాధి రంగంగా ఎదుగుతున్నదని చెప్పారు.