న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ కూడా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన తప్పుకోవడంతో దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇవాళ అనుహ్యంగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి రావడంతో.. తాను అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకుంటున్నానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఖర్గేకే తన మద్దతు ఉంటుందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన పోటీ శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే మధ్యే ఉండనుంది. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఖర్గే పోటీలోకి దిగినట్లు తెలుస్తోంది.