(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నిక సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం కొనసాగుతుండటంపై చర్చ జరుగుతున్నది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల వరకు కూడా సోనియాగాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నుకునే అవకాశం కనిపిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశానికి అశోక్ గెహ్లాట్ను, దక్షిణ భారతదేశానికి పి చిదంబరాన్ని ఉపాధ్యక్షులుగా చేయాలని సోనియా అభిప్రాయపడుతున్నారని తెలిపాయి. కర్ణాటక సీనియర్ నేత డీకే శివకుమార్ను వైస్ ప్రెసిడెంట్గా నియమించి, సిద్ధరామయ్యను కర్ణాటక సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల ప్రక్రియకు టైమ్లైన్ ప్రతిపాదిస్తూ ఏఐసీసీ నేత, సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ సోనియాకు ఓ లేఖ రాసినట్టు సమాచారం. సోనియా, రాహుల్పై ఈడీ విచారణల కారణంగా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై వివరించేందుకు వచ్చే వారంలో మధుసూదన్ ఎన్నికల సంఘం అధికారులతో భేటీకానున్నారు. ఈ కారణాన్ని ఈసీ తిరస్కరిస్తే.. ప్రతిపాదిత టైమ్లైన్ను ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమయ్యే అవకాశం ఉన్నది. భారత్ జోడో యాత్ర ప్రారంభమయ్యే సెప్టెంబర్ 7లోగా ఎన్నికల ప్రక్రియను ముగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నది.