జైపూర్, నవంబర్ 21: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నోరుజారారు. అనుప్గఢ్ సభలో సోమవారం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి చెప్పబోయి ‘దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ తన జీవితాన్ని అర్పించారు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్నవారు అలర్ట్ చేయడంతో ఖర్గే తన వ్యాఖ్యలను సవరించారు. రాజీవ్ గాంధీ పేరుకు బదులు తప్పుగా రాహుల్ గాంధీ పేరు మాట్లాడానని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యల వీడియోను ప్రతిపక్షాలు షేర్ చేస్తూ.. ‘ఇదెప్పుడు జరిగింది?’ అంటూ ఎద్దేవా చేశాయి.