Congress | అంతన్నాడింతన్నాడే గంగరాజు.. కరెంటే లేదన్నాడే కాంగ్రెస్ రాజు.. ఇదీ ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి! కర్ణాటక.. 68 ఏండ్ల క్రితమే ఏర్పడిన రాష్ట్రం. బెంగళూరు.. ఐటీ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన నగరం. నిత్యం వందల మంది దేశ, విదేశీ ప్రముఖులు వచ్చిపోయే ప్రదేశం.. అలాంటి బెంగళూరు ఇప్పుడు కరెంటు కోతలతో అతలాకుతలం అవుతున్నది. ఐటీ రాజధానిలోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు కరెంట్ కట్. ఇది అధికారికం. లోడ్ షెడ్డింగ్, మెయింటెనెన్స్ పేరుతో జరిగే కోతలు అనధికారికం. కర్ణాటకను బీజేపీ 9 ఏండ్లు, కాంగ్రెస్ 40 ఏండ్లు పరిపాలించాయి. మొన్నటికి మొన్న బీజేపీని దించి గద్దెనెక్కే క్రమంలో అర‘చేతి’లో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ.. యథాప్రకారం కుక్కతోక వంకర అన్నట్టు ఇచ్చిన మాట మర్చిపోయింది.
కరెంటు కోతలు లేనేలేకుండా చేస్తామని చెప్పటం చేతకాని కాంగ్రెస్, కోతలు 4 గంటలకు మించకుండా చూస్తామని కోతలు కోసింది. ఇప్పుడు ఆ మాత్రమూ చేయలేకపోతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తామనే దమ్ములేని కాంగ్రెస్, తొమ్మిది గంటల కరెంటు తప్పక ఇస్తామని గొప్పలకు పోయింది. ఇప్పుడు ఏడు గంటలు కూడా ఇవ్వలేక చేతులెత్తేస్తున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? సీఎం సిద్దరామయ్యను కూల్చడానికి డిప్యూటీ ప్రయత్నిస్తుంటే, డిప్యూటీ సీఎం శివకుమార్ అక్రమాలను బజారుకీడ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నాడు. ఎవరికి వారు గ్రూపులు కట్టి తిరుగుబాటు జెండాలు ఎగరేస్తుంటే, వాటిని సర్దుబాటు చేసుకోవడానికి నాయకులు ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు, కర్ణాటకను చూపిస్తూ తెలంగాణలో గద్దెనెక్కుతామని కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు కర్ణాటకలోని దౌర్భాగ్యానికి ఏం జవాబు చెప్తారు? కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏపీ కూడా ఈ దృశ్యాలనే చూసింది కదా! మరిప్పుడు కాంగ్రెస్ విముక్త తెలంగాణ కరెంటు విషయంలో ఎంత ముందుకుపోయింది! ఈ రోజు దేశంలో అత్యంత నాణ్యమైన, నిరంతర కరెంటు సరఫరా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అత్యధిక కరెంటు వినియోగమూ తెలంగాణదే. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పాత కథలను పక్కన పెడదాం.. కర్ణాటక-తెలంగాణ నేటి సాక్ష్యం. కరెంటు ఒక్కటిచాలదా ఎవరి పనితీరు ఏమిటో చెప్పడానికి!
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బెంగళూరు.. సిలికాన్ సిటీగా పేరున్న నగరం.. దేశంలో ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన నగరం.. అంతటి ప్రధాన నగరం నేడు కరెంటు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. రోజుకు ఐదారుగంటలు కరెంటు కోతలతో సామాన్యులతోపాటు పరిశ్రమల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. నగరంలో ఏరోజు, ఎక్కడ, ఎన్ని గంటలు కరెంటు ఉండదనే విషయాన్ని ఏకంగా బులెటిన్ల రూపంలో విడుదల చేస్తున్నారంటే అక్కడ కరెంటు సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో అయితే కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీజేపీ, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు నేటి బెంగళూరు కష్టాలే సజీవ సాక్ష్యం.
ఉచితం పాయె.. ఉన్నదీ పాయె
అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి మూడు నెలలైనా తిరగక ముందే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఐదు గ్యారంటీ పథకాలంటూ ఎన్నికల్లో ఉదరగొట్టి ఓట్లేయించుకొన్న ఆ పార్టీ, అప్పుడే తన అసలు స్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఉచితం మాట దేవుడెరుగు, అసలు కరెంటే కరువైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరు లోనే రోజుకు ఐదారు గంటలపాటు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో విద్యుత్తు కోతల సమస్య అంతా ఇంతా కాదు. పక్కనే ఉన్న తెలంగాణలో 24 గంటలపాటు కరెంటు బుగ్గలు వెలుగుతుంటే.. తమ రాష్ట్రంలో నాలుగు గంటలు కూడా గగనమైతున్నదని కర్ణాటక వాసులు వాపోతున్నారు. అధికారమిచ్చిన కార్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ ఇంత నిర్వాకం చేస్తే.. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తే పరిస్థితి ఏమిటని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులకు మూడు గంటలు కరెంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇప్పటికే తేల్చేశారు. 24 గంటల విద్యుత్తు అవసరమే లేదని ఆ పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేయటమంటే విద్యుత్తు కష్టాలను కొనితెచ్చుకోవటమేనని సామాన్యులు సైతం భయపడుతున్నారు.
మిగతా కాంగ్రెస్పాలిత రాష్ర్టాల్లోనూ ఇంతే
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లోనూ కరెంటు పరిస్థితి ఇలాగే ఉన్నది. కరెంటు కోతలకు రాజస్థాన్ నిలయంగా మారింది. తాలూకా స్థాయిలో రోజుకు ఒక గంట (ఉదయం 7 నుంచి 8 గంటల వరకు) జిల్లా కేంద్రాల్లో రోజూ 2 గంటలు (ఉదయం 7 నుంచి 9 గంటల వరకు), మునిసిపాలిటీ కేంద్రాల్లో రోజుకు 3 గంటలతో పాటు, 5 వేలకు మించిన జనాభా ఉన్న పట్టణాల్లో రోజుకు 3 గంటల (ఉదయం 6 నుంచి 9 గంటల వరకు)పాటు పవర్ కట్ చేస్తున్నట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. జైపూర్, జోధ్పూర్, అజ్మీర్ లాంటి నగరాల్లో ఉదయం 7 నుంచి 8 గంటలవరకు అనధికారికంగా విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి 6 గంటలకు బదులుగా 5 గంటలపాటే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్లోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి.
పెనంపై నుంచి పొయ్యిలోకి..
కర్ణాటకలో బీజేపీ పాలనతో ప్రజలు విసిగి వేసారే కాంగ్రెస్కు పట్టం కట్టారు. కానీ వారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. వారం రోజులుగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు గంటలపాటు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనధికార కోతలు ఆరేడు గంటలపాటు విధిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు చార్జీల పెంపుతో సామాన్యులతోపాటు పారిశ్రామిక వర్గాలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్తు కోతలను నిరసిస్తూ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు జూన్ 22న బంద్ పాటించాయి. బెంగళూరులో విద్యుత్తు కోతలతో చాలా కంపెనీలు ఉద్యోగుల షిఫ్టులను మారిస్తే, కొన్ని కంపెనీలు సాయంత్రం 4 గంటలలోపు పనులను పూర్తిచేసుకోవాల్సిందిగా ఉద్యోగులకు సూచిస్తున్నాయి. విద్యుత్తు కోతలకు భయపడి మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. కరెంటు కోతలతో ఉత్పత్తి పడిపోతున్నదని, పవర్ హాలిడేలు ప్రకటించే దుస్థితి దాపురించిందని పారిశ్రామికవర్గాలు మండిపడుతున్నాయి. కరెంటు కోతలను తాళలేక రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు, రైతులు రోడ్డెక్కుతున్నారు. ‘గృహజ్యోతి’ పేరిట ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కరెంటే ఇవ్వటంలేదని ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్తు కోతలు భరించలేక మంగళూరులోని అపార్ట్మెంట్వాసులు డీజిల్ జనరేటర్లను కొనుగోలు చేస్తున్నారు.
బుకాయింపులతో సరి
బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ విద్యుత్తు కోతలు విధించేది బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్సీవోఎం)తో పాటు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) అధికారికంగానే ప్రకటిస్తున్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కొన్ని చోట్ల, సాయంత్రం 5 గంటల వరకు మరికొన్ని చోట్ల విద్యుత్తు కోతలు ఉంటాయని ప్రతివారం షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి. వారంలో ఏ రోజు ఏ ప్రాంతంలో ఎన్నిగంటలపాటు కోతలు ఉండబోతున్నాయో తేదీలు, సమయంతో సహా ప్రకటిస్తున్నాయి. విద్యుత్తు కోతలకు కారణం పవర్ లైన్స్ మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులేనని విద్యుత్తు సంస్థలు చెప్తున్నాయి. కానీ, బెంగళూరులో గురువారం ఒక్కరోజే 80కి పైగా ప్రాంతాల్లో 4 గంటలపాటు కోతలు విధించారు. మరమ్మతుల పనులకోసమైతే ఇన్ని ప్రాంతాల్లో ఒక్కసారే ఇంత సమయంపాటు కోతలు ఎందుకు విధిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంగళూరు, ఉడుపి, శివమొగ్గ తదితర జిల్లాల్లో విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణదే రికార్డు
దేశంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,255 యూనిట్లు
కర్ణాటక తలసరి విద్యుత్తు వినియోగం 1,184 యూనిట్లు
తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 2,166 యూనిట్లు
రైతన్నల నిరసనలు
విద్యుత్తు కోతలను నిరసిస్తూ బాడగి తాలుకాలోని కల్గండో, హెడిగ్గొండా, కగినెల్, నాగలాపూర్, కుమ్మూరుకు చెందిన వందల మంది రైతులు హుబ్లీ ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (హెచ్ఈఎస్సీవోఎం) ముందు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిక్మగళూర్ పట్టణంలో కూడా అన్నదాతలు తాలుకా కార్యాలయం నుంచి మంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ (ఎంఈఎస్సీవోఎం) వరకు ర్యాలీ నిర్వహించారు. కరెంటు కోతలతో విసిగివేసారిన పారిశ్రామికవేత్తలు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (బెస్కాం) అధికారులకు హారతి పట్టి వినూత్నంగా నిరసన తెలియజేయడం నిరుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణలో నిత్య వెలుగులు
కాంగ్రెస్ పాలనలో కర్ణాటక కరెంటు లేక అల్లాడుతుంటే.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విద్యుత్తు కాంతులతో వెలిగిపోతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో కర్ణాటక కునారిల్లిపోతే.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతి శిఖరాలవైపు పరుగులు పెడుతున్నది. అందుకు తలసరి విద్యుత్తు వినియోగమే ఉదాహరణగా నిలుస్తున్నది. కర్ణాటకలో డబ్బులిచ్చి కొందామన్నా కరెంటు దొకరని పరిస్థితి ఉంటే.. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా కరెంటు అందుతున్నది. పరిశ్రమలు, గృహాలకు అడిగినంత కరెంటును ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
రాత్రిళ్లు పిల్లలు నిద్రపోవట్లేదు
విద్యుత్తు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రిళ్లు కూడా కరెంటు తీసేస్తున్నారు. మూడునాలుగు గంటలైనా కరెంటు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పిల్లలు నిద్ర కూడా పోవట్లేదు.
– మలప్ప లక్ష్మణ పూజారి, మంగళూరు
అది కాంగ్రెస్కే సాధ్యం
ఒకచేతితో చాక్లెట్ ఇచ్చి, మరో చేతితో గుంజుకున్నట్టు ఉన్నది కాంగ్రెస్ వైఖరి. ‘గృహజ్యోతి’ పేరిట ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కరెంటు కోతలు విధించటం కాంగ్రెస్కే చెల్లింది.
– బీకే ఇంతియాజ్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణ కన్నడ