Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంపై మంగళవారం కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఫస్ట్ దోచుకోండి.. ఆ తర్వాత శిక్ష నుంచి తప్పించుకోండి..! ఇదే మోదానీ మోడల్ అన్నారు.
‘నేరస్తులను ‘రక్షించే’ వారు దేశభక్తి గురించి మాట్లాడడం ‘జోక్’లాంటిది. వాళ్లు అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దౌత్య కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ కోరుతాం’ అన్నారు. ప్రతిపక్ష నేతల కోసం ఈడీ, సీబీఐ, కానీ మోదీజీ ‘మా మెహుల్ భాయ్’ కోసం అంటూ సెటైర్లు వేశారు. ‘బెస్ట్ ఫ్రెండ్’ కోసం పార్లమెంట్ను స్తంభింపజేయగలిగినప్పుడు.. ఐదేళ్ల కిందట పరారీలో ఉన్న ‘పాత స్నేహితుడు’కి సహాయం చేయడానికి ఎలా నిరాకరిస్తాడు? అని పేర్కొన్నారు. ‘దేశం నుంచి వేలాది కోట్లు వెళ్లాయి. ‘నా ఖానే దూంగా’ అనేది మరో ‘జుమ్లా’ అయ్యింది’ అంటూ విమర్శించారు.
పార్లమెంట్లో చర్చలను ప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తోందని నిలదీశారు. సభను నిర్వహించడం, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ‘సాఫ్ నియత్, సహి వికాస్’ ఉంటే చర్చల నుంచి పారిపోవడం ఎందుకు పీఎం సాబ్? అంటూ విమర్శించారు. ఇదిలా ఉండగా.. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఉన్న రెడ్కార్నర్ నోటీసులను ఇంటర్పోల్ డేటాబేస్ నుంచి తొలగించింది. మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13వేలకోట్ల కుంభకోణం కేసులో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చోక్సీ నిందితుడిగా ఉన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.