న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నారు. అలాగే దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ నెల 8వ తేదీతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నది. మరో వైపు కేంద్రం క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) తదితర బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
మరో వైపు ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంధన ధరలపై మాట్లాడనున్నారు. ఇప్పటికే ధరల పెంపుపై ధరల పెరుగుదలపై ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి జన్ధన్ లూట్ యోజనగా మారిందని విమర్శించారు. ఇదిలా ఉండగా ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ పెరిగాయి. గత 15 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది 13వ సారి. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ప్రదేశ్, గుజరాత్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికలపై సైతం చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.