Himachal Pradesh | సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలే దానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఈ తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది.
ఈ పరిణామాల మధ్య సీఎం పదవికి సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని, బీజేపీ నేతలు అలా ప్రచారం చేస్తున్నారని సీఎం సుఖు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అధికార కాంగ్రెస్.. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. 2017 ఎన్నికల్లో 44 నియోజకవర్గాల్లో గెలుపొంది, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. 2022 ఎన్నికల్లో మాత్రం 25 స్థానాలకే పరిమితమైంది. అయితే నిన్న రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు.. బీజేపీలో చేరితే.. సభ్యుల సంఖ్య 34కు చేరుతుంది.
అయితే బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర స్పీకర్ కుల్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో గందరగోళం సృష్టించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే వీరిది బహిష్కరణా..? సస్పెండా..? అనే విషయంలో స్పష్టత లేదు. ఒక వేళ బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరణకు గురైతే సభా బలం 53కు చేరుతుంది. అప్పుడు మేజిక్ ఫిగర్ 27 అవుతుంది. బలపరీక్షలో కాంగ్రెస్ పార్టీ సులభంగా గట్టెక్కుతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బహిష్కరించబడ్డారా..? సస్పెండ్కు గురయ్యారా..? అనే విషయంలో స్పష్టత లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్కు గురైతే సభా బలం 68గానే ఉంటుంది. మేజిక్ ఫిగర్ 35. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ బలం 34కు చేరుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విక్రమాదిత్య సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.