చండీఘఢ్ : మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క బయటకువస్తుందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఈ ఎన్నికలు మార్పు కోసం జరిగాయని..ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని..వారెప్పుడూ పొరపాటు చేయరని కాంగ్రెస్ పార్టీకి చురకలు వేశారు. సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిందా అని ప్రశ్నించగా చన్నీని సీఎం అభ్యర్ధిగా ప్రజలు అంగీకరించారా లేదా అనే విషయం లోకి తాను వెళ్లదలుచుకోలేదని అన్నారు.
సిద్ధూలో లోపాలు వెతికిన వారిని ప్రజలు పది అడుగుల గోతిలో పడేశారని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించారు. తాజా ఫలితాలతో మనం కొత్త విత్తనాలను నాటాలని..ఇప్పుడు కావాల్సింది చింత కాదని, చింతన్ (మేధోమధనం) అవసరమని సిద్ధూ వ్యాఖ్యానించారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్దానాలకు గాను ఆప్ 92 స్ధానాల్లో విజయం సాధించగా పాలక కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది.
ఇక ఎస్ఏడీ మూడు స్ధానాలు, బీజేపీ రెండు స్ధానాలు, బీఎస్పీ ఒక స్ధానంతో సరిపెట్టుకున్నాయి. ఆప్ ప్రభంజనంలో చన్నీ, ప్రకాష్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ వంటి దిగ్గజ నేతలు ఓటమి పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటమితో సీఎం చన్నీ గురువారం గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈనెల 16న ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.