ముంబై: సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గౌరీ లంకేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్గాంధీపై 2017లో పరువు నష్టం కేసు నమోదైంది.
సీపీఐ (ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు తన పేరును ఈ కేసులో తప్పుగా ఇరికించారని రాహులగాంధీ తన పిటిషన్లో పేర్కొన్నారు. గౌరీ లంకేష్ హత్య అనంతరం సీతారాం ఏచూరి వేరే చోట, వేరే సమయంలో ప్రకటన చేశారనే విషయాన్ని తన పిటిషన్లో ప్రస్తావించారు. కాగా, గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు. మతపరమైన విమర్శలు చేస్తున్నారన్న కారణంతో గౌరీ లంకేష్ను హిందూ అతివాద భావజాలం ఉన్న కొందరు కాల్చి చంపారు.
ఈ హత్య జరిగిన 24 గంటల్లోనే రాహుల్ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలకు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరిపై అయినా ఒత్తిడి చేస్తారని, దాడులు జరిపి చంపేస్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులే జర్నలిస్టును హత్య చేశారని ఏచూరి ఆరోపించారు.
దాంతో గౌరీ లంకేష్ హత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముడిపెట్టారని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధృతిమాన్ జోషి.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిపై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ పరువు తీశారని తన దావాలో పేర్కొన్నారు.