న్యూఢిల్లీ, ఏప్రిల్ 12:రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఒకవేళ కమలం పార్టీ ‘ఒక దేశం-ఒక పాలు’ నినాదమిస్తే, దాన్ని తాము ఆమోదించమని హెచ్చరించారు. అమూల్, నందిని బ్రాండ్లు జాతీయ స్థాయిలో శ్వేత విప్లవ విజయానికి ప్రతీకలని తెలిపారు.
అయితే రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను విలీనం చేసి వాటిపై కేంద్రం పెత్తనం చెలాయించాలనుకుంటున్నదని ఆయన ఆరోపించారు. అమిత్ షా వేస్తున్న ఈ ఎత్తుగడలను తాము సహించబోమన్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ను బలవంతం చేయడం చూస్తుంటే అన్ని డెయిరీ యూనియన్లను బీజేపీ తన రాజకీయ విభాగాలుగా చేసుకోవాలనే ప్రయత్నం కనిపిస్తున్నదని మండిపడ్డారు.