ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు, అతని బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఐటీ దాడుల్లో శనివారం నాటి వరకు మొత్తం రూ.290 కోట్ల డబ్బు దొరికిందని.. తమ శాఖ దాడుల్లో ఒకేసారి ఇంత మొత్తం పట్టుబడటం దేశంలో మొదటిసారి అని ఐటీ డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు.
ఢిల్లీ/భువనేశ్వర్, డిసెంబర్ 9: ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నాలుగో రోజూ తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ ఎంపీ, అతని బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఈ దాడుల్లో నగదు కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. శుక్రవారం వరకు రూ.225 కోట్లు పట్టుబడగా, శనివారం నాటికి ఆ మొత్తం రూ.290 కోట్లకు చేరినట్టు ఐటీ డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఈ మొత్తం ఇంకా పెరగవచ్చన్నారు.
ఐటీ శాఖ జరిపిన దాడుల్లో ఒకేసారి ఇంత మొత్తంలో పట్టుబడటం దేశంలో ఇదే ప్రథమం. స్వాధీనం చేసుకున్న డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి 20 మంది అధికారులను రప్పిస్తున్నారు. నిర్విరామంగా పని చేస్తుండటంతో కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయించాయి. దీంతో వేరే బ్యాంకులు, సంస్థల నుంచి మిషన్లు తెప్పించారు.
పట్టుబడిన మొత్తం సొమ్ములో బొలంగీర్ జిల్లా సుదాపరలో ఒక మద్యం కంపెనీలో ఉన్న 8 అల్మారాల్లో 230 కోట్ల నగదు దొరికిందని, మిగతా సొమ్ము టిటాగర్, సంబల్పూర్, రాంచీలలో లభించాయన్నారు. ఇందులో జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్కు రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు సంస్థలు కూడా ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. ప్రధానంగా బల్దేయో సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్)పై ఐటీ దాడులు కొనసాగాయి. ఇది ఎంపీకి చెందినదే అన్న ఆరోపణలున్నాయి. కాగా ఐటీ దాడులను ఒడిశాలోని అధికార బీజేడీ స్వాగతించింది. కాంగ్రెస్ అవినీతి దుకాణం తెరిచిందని బీజేపీ విమర్శించింది.