న్యూఢిల్లీ : ఇటీవల ఒడిశాలో ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన నగదుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏదైనా ఇతర రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు చెప్పారు. ఈ సొమ్ము తనది కాదని.. తన కుటుంబసభ్యులకు, ఇతర సంస్థలకు సంబంధించినదని తెలిపారు. తన సంస్థ దాదాపు వందేడ్లకుపైగా వ్యాపార రంగంలో ఉందన్నారు. మద్యం వ్యాపారంలో లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయన్నారు.
పట్టుబడిన నగదు డిస్టిలరీ కంపెనీకి చెందినదని తెలిపారు. పట్టుబడిన నగదుకు లెక్కలు చెబుతానని తెలిపారు. ఇదంతా నల్లధనమని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, నల్ల ధనమా? తెల్ల ధనమా? అనే విషయాన్ని ఐటీ శాఖ నిర్ణయిస్తుందన్నారు. ఒడిశాలో ధీరజ్ సాహుకు చెందిన బౌధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై సోదాల్లో ఐటీ అధికారులు రూ.353 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే.