బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka polls) బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మోదీ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలనే చర్చ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని లేకుంటే దేశ ప్రజలు మనల్ని క్షమించరని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి ఆదివారం పిలుపు ఇచ్చారు.
విపక్షాలు కలిసికట్టుగా ఉంటే బీజేపీ అధికారంలో ఉండదని తాము మొదటినుంచీ చెబుతున్నామని, కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాషాయ పార్టీలకు ఇక చెల్లుచీటీ తప్పదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజల ఓటు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ తరహాలో ఒక పార్టీ వైపే ఎప్పుడూ ఉండదని, కాలానుగుణంగా అది మారుతుంటుందని చెప్పారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని దేశమంతటా సంబరాలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రజలు అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ను దాటి ఏకంగా 136 స్ధానాల్లో గెలుపొందింది. కర్నాటక సీఎం రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.
Read More