చండీఘఢ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా శనివారం భగ్గుమన్నారు. విదేశీ కార్మికులను రాష్ట్రం ఓ రోజున ఆకట్టుకుంటుందని సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. స్ధానిక సమస్యలను పరిష్కరించలేని ఆప్ విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తామని చెబుతోందని వ్యాఖ్యానించారు.
ఉచితాల పేరుతో పంజాబీలను ఆప్ నాయకత్వం మభ్యపెట్టిందని మండిపడ్డారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ఆయన నిలదీశారు. పంజాబీ యువతకు ఉద్యోగాలు కల్పించారా అని ప్రశ్నించారు. మహిళలందరికీ రూ 1000 నగదు ఇస్తామని చెప్పారని ఆ పధకం సంగతేమిటని అన్నారు.
పంజాబ్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ మహిళలకు కూడా రూ 1000 ఇస్తారా..? ఇక్కడకు వచ్చే విదేశీయులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తింపచేస్తారా అని ప్రశ్నించారు. ఇదేం కామెడీ సర్కస్ కాదు సీరియస్గా వ్యవహరించండని మాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భటిండాలోని మహరాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ మండిపడ్డారు.