ఐదు రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పరిణామాలను చూస్తే తెలిసిపోతోంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రావొచ్చని కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలింది. దీంతో పార్టీ అలర్ట్ అయ్యింది. తమ అభ్యర్థులను కాపాడే పనిలో నిమగ్నమైంది. ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో వ్యవహరించే తీరుపై సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఈ మూడు ప్రాంతాలకు ప్రత్యేకంగా పరిశీలకులను కూడా పంపింది. పంజాబ్కు అజయ్ మాకెన్ను, ఉత్తరాఖండ్కు సీఎం భూపేశ్ బాఘేల్ను, గోవాకు కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ను పంపించారు.
ఈ ముగ్గురూ ఈ మూడు రాష్ట్రాల ఓటింగ్ సరళిని, అక్కడి పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేయనున్నారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చే పక్షంలో, అధికారంలోకి రాని పక్షంలో అప్పటికప్పుడు అనుసరించే వ్యూహాలను వీరు పన్నుతున్నారని నేతలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా… పార్టీ అభ్యర్థులపై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ ముగ్గురూ తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోయారు. నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అభ్యర్థులను ఎయిర్ లిఫ్ట్ చేయనున్న కాంగ్రెస్..
తమ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు హ్యాండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ చూసుకుంటోంది. గోవాలో ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలకు తెర లేపింది. ఇబ్బందులున్న ప్రాంతాల్లో తమ తమ అభ్యర్థులను విమానాల్లో (ఎయిర్ లిఫ్ట్) పంపనున్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది. కాంగ్రెస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అని. అయితే… జ్యోతిరాదిత్య సింధియా విషయంలో ఈ పరిణామం జరిగింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆయన రాజస్థాన్ను చెందిన 26 మంది ఎమ్మెల్యేలను విమానంలోనే తరలించారు. అయితే అది కాంగ్రెస్ను చీల్చే ప్రయత్నంలో భాగం. ఇప్పుడు మాత్రం తమ తమ అభ్యర్థులను కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం.