‘ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి’ అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్టు 27-29 వరకు గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాసిన ఈ లేఖ వైరల్గా మారింది.
‘కోస్టల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ఆమోదం తెలిపింది. హైవే అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన రహదారిలో చాలా చోట్ల గుంతలు పడ్డాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రికి లేఖ రాసినా ఎలాంటి చర్య తీసుకోలేదు’ అని విమల్భాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో సోమనాథ్ ఆలయానికి లక్షలాది మంది భక్తులు ఈ రహదారిని ఉపయోగిస్తారని చెప్పారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్కు చైర్మన్గా ఉన్న ప్రధాని మోదీ ఈ రోడ్డుగుండా ప్రయాణిస్తే భక్తుల బాధలు అర్థమవుతాయని తెలిపారు. భక్తుల బాధలను అర్థంచేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.