జైపూర్ : రాజస్దాన్లోని అళ్వార్ జిల్లాలో పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేసిన ఘటన రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆలయం కూల్చివేతపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఆలయం కూల్చివేత కాషాయ పార్టీ పనేనని రాజ్ఘర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోహరి లాల్ మీనా శనివారం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆలయం కూల్చివేత ఆదేశాలు జారీ చేయకుంటే బీజేపీ నేతలు రాజ్ఘర్ నుంచి ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు.
ఈ ఆలయం 300 ఏండ్ల నాటిదని బీజేపీ నేతలు చెబుతున్న విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే తోసిపుచ్చారు. ఇది కనీసం 30 ఏండ్ల నాటి ఆలయం కూడా కాదని అన్నారు. ఆలయ కూల్చివేతలో బీజేపీ నేతల తప్పు లేకపోతే వారు పట్టణం నుంచి ఎందుకు పరారయ్యారని నిలదీశారు. మున్సిపల్ చైర్మన్తో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లు పత్తా లేరని అన్నారు. కూల్చివేత ఉత్తర్వులపై చైర్మన్ సంతకం చేయని పక్షంలో ఆయన ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. దొంగలు పారిపోయినా తాను ప్రజల మధ్యే ఉన్నానని చెప్పారు.
గత 35 ఏండ్లుగా బీజేపీ మున్సిపాల్టీలో అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఆలయ కూల్చివేతలో తన ప్రమేయాన్ని వారు రుజువు చేయలేరని అన్నారు. ఆలయ కూల్చివేతకు బీజేపీ పాల్పడినా తాము దాన్ని పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాగా అళ్వార్లో ఆలయ కూల్చివేతలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ఘర్ మున్సిపల్ చైర్మన్ సతీష్ గురియా తోసిపుచ్చారు. కాగా, ఆలయాలను కూల్చివేయాలని మున్సిపాలిటీ ఎన్నడూ ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు.