న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే బిల్లుకు కాంగ్రెస్ పార్టీ (Congress) మద్దతివ్వనున్నట్లు (Support) తెలుస్తున్నది. పార్టీ అంతర్గత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రాల్లో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల హక్కులను పరిరక్షించడానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ (Jairam Ramesh) అన్నారు. సమాఖ్య నిర్మాణంపై ఎలాంటి దాడి జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా నిలుస్తామని నేరుగా ప్రకటింకచపోయినప్పటికీ.. రాష్ట్రలపై కేంద్రం చేసే దాడులకు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) లోపల, బయట కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపక్షాల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం విధితమే.
కాగా, శనివారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా హస్తం పార్టీ పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తుందని జైరాం రమేశ్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల రాజ్యాంగ హక్కులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు.