Karnataka Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి. అక్కడ ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదన అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నది. సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు తలెత్తడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఈ వివాదంతో అధికార పక్షం సీఎం, డిప్యూటీ సీఎంల గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలనే ప్రతిపాదన ఎందుకు వస్తుందో ఆయన్నే (సిద్ధరామయ్య) అడగండంటూ డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అధికార పక్షంలో తీవ్ర కలకలం సృష్టించగా.. ఐదేండ్ల పాటు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో శివకుమార్ వర్గం పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన మంత్రి కేఎన్ రాజన్న, మంత్రి గుండూరావు ఇద్దరూ సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులు. దీంతో వీరితో సిద్ధరామయ్యేమాట్లాడించారని డీకే వర్గం అనుమానిస్తున్నది.