బెంగళూర్ : తన తాతను కర్నాటక మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య శనివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో జయచంద్రకు చోటు దక్కలేదు. తన తాత మంత్రి పదవిని చేపట్టకపోవడం విచారకరమని, తన తాతకు కేబినెట్లో స్ధానం కల్పించేలా చొరవ చూపాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో జయచంద్ర మనవరాలు ఆర్ణ కోరింది.
తన తాత దయకలిగిన వ్యక్తి, కష్టపడి పనిచేసే స్వభావంతో పాటు సామర్ధ్యం కలిగిన వారని అందుకే ఆయనను మంత్రిగా చూడాలని తాను కోరుకుంటున్నానని రాహుల్కు రాసిన లేఖలో ఆమె రాసుకొచ్చారు. కాగా, టీబీ జయచంద్రను అసెంబ్లీ స్పీకర్గా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇదే విషయమై జయచంద్రతో సీఎం సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సుర్జీవాలా, మల్లికార్జున్ ఖర్గే పలుమార్లు మంతనాలు జరిపారు.
స్పీకర్ పదవి చేపట్టేందుకు నిరాకరించిన జయచంద్ర తన ఫోన్ను సైతం స్విఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. తనను కేబినెట్లోకి తీసుకోకపోవడం పట్ల జయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన తనను ఎందుకు మంత్రిని చేయలేదని, తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని కుంచితిగ వర్గీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని జయచంద్ర వాపోయారు.
Read More