న్యూఢిల్లీ, మార్చి 16: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు. అలాంటి పార్టీలతో ఇప్పటి నుంచే సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్ఠి నాయకత్వంతో ముందుకు నడిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అన్ని స్థాయిల్లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జీ-23 నేతలు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో మరోసారి సమావేశమయ్యారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్లో అంతర్గతంగా చేయాల్సిన మార్పులపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, శశి థరూర్, పృథ్విరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపింద్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్, సందీప్ దీక్షిత్లతో పాటు కొంత మంది కొత్త నేతలు కూడా పాల్గొన్నారు. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్, హర్యానా మాజీ స్పీకర్ కుల్దీప్ శర్మ కొత్తగా ఈ గ్రూపులో చేరారు.
మొదట ఈ సమావేశాన్ని కపిల్ సిబల్ ఇంట్లో నిర్వహించాలని భావించారు. అయితే చివరి క్షణంలో మార్పు చేశారు. ఆదివారం నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశానికంటే ముందు రోజు కూడా జీ-23 నేతలు ఆజాద్ నివాసంలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి, సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకత్వ మార్పు, సంస్కరణలపై ముందడుగు పడకపోవడం, పలువురు సీనియర్ నేతలు గాంధీ కుటుంబానికే విధేయత ప్రకటించిన నేపథ్యంలో జీ-23 నేతలు మళ్లీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఇదిలా ఉండగా, గాంధీ కుటుంబం స్వయంగా కాంగ్రెస్లో పదవుల నుంచి వైదొలగాలన్న కపిల్ సిబల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, అధీర్ రంజన్ చౌదురి మండిపడ్డారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, సిబల్ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు ఇవేమీ కనిపించలేదన్నారు.
కాంగ్రెస్ను విడగొట్టే కుట్ర
వరుస సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ను విడగొట్టడానికి జీ-23 నేతలు ప్రయత్నిస్తున్నారని పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్టీలో సంస్కరణలకు సంబంధించి అన్ని అంశాలు ఇటీవల సీడబ్ల్యూసీలోనే చర్చకు వచ్చాయని, అయినప్పటికీ జీ-23 నేతలు మళ్లీ సమావేశం కావడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఎవరూ బలహీనం చేయలేరన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ నేతలు సోనియాతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
సంస్థాగత మార్పులపై సూచనలకు నేతల నియామకం
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల అనంతర పరిస్థితులను పరిశీలించడంతో పాటు ఆయా రాష్ర్టాల్లో సంస్థాగత మార్పులపై సూచనలు చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఐదుగురు సీనియర్ నాయకులను నియమించారు. మరోవైపు, అధిష్ఠానం ఆదేశాల మేరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నవ్జోత్ సింగ్ సిద్ధూ. మణిపూర్ పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్ లోకేన్ సింగ్ రాజీనామా చేశారు.