యూపీ ఎన్నికల నేపథ్యంలో జంప్ జిలానీల పర్వం కొనసాగుతోంది. తాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్విట్టర్ వేదికగా పంపించారు. వచ్చే నెలలో బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఆర్పీఎన్ సింగ్ యూపీ కాంగ్రెస్లో పెద్ద తలకాయ. అధిష్ఠానంతో ముఖ్యంగా రాహుల్ గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలే వున్నాయి. అంతేకాకుండా పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కూడా ఈయన పేరుంది. గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఆ పర్వ దినాలలో మనం వున్నాం. నా రాజకీయ జీవితంలో ఓ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నా. జై హింద్ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల సందర్భంగా సింగ్ పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకర్గంపై ఆయనకు అపారమైన పట్టుంది. మొన్నటికి మొన్నే బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే సింగ్ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా 2009 నుంచి ఖుషీనగర్ నుంచి ఎంపీగా కూడా గెలుపొందారు. అయితే 2014 లో మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈయన స్థానంలో స్వామి ప్రసాద్ మౌర్య గెలుపొందారు.
ఆర్పీఎన్ సింగ్ యూపీ కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత. పైగా అధిష్ఠానానికి బాగా కావాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ప్రకటించిన మొదటి అభ్యర్థుల జాబితాలో ఆర్పీఎన్ సింగ్ పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు ఆయన వర్గం పేర్కొంటోంది. ఈ కారణంగానే ఆయన పార్టీకి గుడ్బై చెప్పినట్లు సమాచారం.
ఆర్పీఎన్ సింగ్ పార్టీకి గుడ్బై చెప్పడంపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. కేవలం పిరికిపందలే పార్టీలు మారస్తుంటారని మండిపడ్డారు. పిరికి వాళ్లే ఇలా సైద్ధాంతికంగా వైరుద్ధ్యమున్న పార్టీల్లోకి వెళతారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎప్పటి నుంచో సైద్ధాంతిక యుద్ధం సాగుతోందని, ఈ యుద్ధంలో గెలుపొందాలంటే ధైర్యస్థులకే సాధ్యమని, పిరికిపందలే ఇలా పార్టీని వదిలేస్తారని సుప్రియా శ్రీనాథే తీవ్రంగా ఎద్దేవా చేశారు.